మహిళల సంక్షేమమే ఆలంబనగా రాత్రింబవళ్ళు పనిచేసే అంగన్వాడీల శ్రమను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.వారి నెలసరి వేతనాలను రెట్టింపు చేసింది. పోరాటాల ఫలితంగా పొందిన ఈ విజయం పట్ల అంగన్వాడీలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్యాస్, కాస్మొటిక్స్ వంటి ధరల్లో ప్రస్తుతం ఎటువంటి పెంపుదల సూచనలు లేవని బడ్జెట్ భరోసా ఇచ్చింది. బ్రాండెడ్ వస్త్రాలపై పన్ను పెంపుదలతో వాటి రేట్లు పెరిగే అవకాశం వుంది. వృద్ధాప్య పింఛనుదారుల వయసును 65-60కి తగ్గించి మేలు చేసింది.మహిళలకు సంబంధించి ఇతరత్రా కొన్ని విషయాల్లోనూ కేంద్ర బడ్జెట్ కాస్త వెసులుబాటును కల్పించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కాస్త ఊరట కలిగించింది.
అంగన్వాడీలకు మంచి కబురు...
ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న అంగన్వాడీలకు కాస్త ఊరట లభించింది. పెరిగిన ధరలతో సతమతమవుతున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ వారి జీతాలను రెట్టింపు చేసింది.దీని వలన దేశం మొత్తంగా 22 లక్షల మంది అంగన్వాడీలు, సహాయకులు లబ్ధి పొందనున్నారు.రాష్ట్రంలో అంగన్వాడీలు 1.6 లక్షల మంది దీనివలన లాభం పొందనున్నారు. ఏప్రిల్ 1వతేదీ నుండి ఈ పెంచిన జీతాలు అమలులోకి రానున్నాయి.
సుదీర్ఘపోరాటాల ఫలితం..
1975లో మాతా, శిశు సం రక్షణ, పిల్లలకు పోషకాహా రం, గర్భిణీస్ర్తీల సంరక్షణ, 0-6 పిల్లల విద్య వంటి అంశాలను సంబంధించి అభివృద్ధి చేయాలనే లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం అంగ న్వాడీ పథకాన్ని ప్రవే శపెట్టింది. నామమాత్రపు జీతాలతో వారిని నియమిం చింది. గర్భిణీ స్ర్తీల సంఖ్యా నమోదు, వారి ఆరోగ్యం, పోషకాహారం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమాచారం, వివరాలు వంటివి తెలియజేయడం వంటి పనులు కూడా వీరే చూసుకుంటారు. పోలియో చుక్కలు, జనాభా లెక్కలు, ఓటర్ల గుర్తింపు, వారి వివరాలు వంటివన్నీ వీరే నిర్వహిస్తారు. ఇంత కష్టపడ్డా సరైన ఫలితం మాత్రం పొందలేకపోయారు.
దీంతో ఎన్నో పోరాటాలు, నిరాహార దీక్షలు చేశారు. రాష్ట్రంలోని ఖమ్మం, నెల్లూరు, కర్నూలు, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల మహిళలు ఎన్నో సార్లు రిలే నిరాహార దీక్షలు చేశారు. అన్ని జిల్లాలలోని సంఘటితంగా పోరాటాలు చేశారు. అంగన్వాడీ వర్కర్లకు, సహాయకులకు నాలుగో తరగతి ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు ఇవ్వాలని కోరారు. ఎన్ని సార్లు వినతులు ఇచ్చినా ప్రభుత్వ స్పందన లేక నిరాశ చెందారు. దశాబ్దాల కాలంగా వారు చేసిన పోరాటానికి ఇప్పుడు ఫలితం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పింఛను దారులకు సాయంగా..
ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛను దారుల వయసు 65 వుండగా ప్రస్తుతం దాన్ని 60కి తగ్గించారు. దీని వలన మరింత మంది మహిళలు దీనిలో భాగం కానున్నారు. ప్రస్తుతం అందరికీ రూ.200 చెల్లిస్తున్నారు. ఇందులోనూ మార్పు చేసి 80 సంవత్సరాలు దాటిన వారికి పింఛను మొత్తాన్ని రూ.500కు పెంచారు.
గృహిణికి బాసట...
పెరిగిన ధరలతో సతమతమవుతున్న గృహిణులకు కాస్త ఊరట లభించే అవకాశాన్ని కల్పించారు.నిత్యావసరాలైన కూరగాయల ధరలు తగ్గించేందుకు వాటి ఉత్పత్తులను పెంచేందుకు నిధులను కేటాయించారు. గ్యాస్ ధరల్లో ప్రస్తుతం ఎటువంటి పెంపుదల లేదు.కాస్మోటిక్స్ ధరలు తగ్గే అవకాశం వుంది. దీంతో కొంతలో కొంత మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాటే గృహోపకరణాల ధరలు కూడా తగ్గే అవకాశం వుంది. ఫ్రిజ్, ఎలక్ట్రికల్స్ వంటివాటిపై కొంత మొత్తం తగ్గింపు చేసే అవకాశాన్ని బడ్జెట్ ఇచ్చింది. మొత్తానికి గృహిణులకు కాస్త వెసులుబాటును కేంద్ర బడ్జెట్ కల్పించింది.
అభివృద్ధికి చేయూత...
మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం రూ.500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మహిళలు లబ్ధి పొంది అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. సంఘాలుగా ఏర్పడి మహిళలు సొంతంగా అభివృద్ధి చెందేందుకు ఇది దోహదం చేస్తుంది.
బ్రాండెడ్ వస్త్రాల ధరల పెంపుదల...
బడ్జెట్లో బ్రాండెడ్ వస్త్రాలపై 10 శాతం పన్నును విధించింది.దీనితో బ్రాండెడ్ వస్త్రాల ధరలు కాస్త పెరగనున్నాయి. ఇది యువతకులకు కాస్త కష్టమైన విషయమే. ఎందుకంటే నేడు వారు ఎక్కువగా ఇష్టపడుతున్న బ్రాండెడ్ జీన్స్, టీషర్ట్స్ వంటిపైనే ఈ ప్రభావం కాస్త ఎక్కువగా వుండొచ్చు. ఇక ఇతర బ్రాండెడ్ వస్త్రాలపై కూడా ధరల పెరుగుదుల ప్రభావం వుంటుంది.
ఉద్యోగినులకు యథాతధం...
ఈ సారి కేంద్ర బడ్జెట్లో ఉద్యోగినులకు ఎటువంటి వరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. వేతనాలకు సంబంధించి ఒకే విధానాన్ని అమలు పరుస్తోంది.దాన్నే యథావిధిగా అమలు చేస్తోంది. ఇతర మినహాయింపులు వంటివాటి ప్రస్తావన ఏమీ లేదు. సర్వత్రా ధరల పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా చేసి వుంటే బాగుండన్న వాదనలు వినిపిస్తు న్నాయి. సాధారణ మహిళల నుండి ఉన్నత స్థాయి ఉద్యోగినుల వరకు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతు న్నారు. గ్యాస్ ధరలు పెంచకపో వడం పట్ల ఆనంద పడు తున్నారు. కొత్త పథకాలు ఏవైనా ప్రవేశపెట్టి వుంటే బాగుం డేదన్న అభిప్రాయాన్ని కూడా వారు వెలి బుచ్చుతున్నారు. గ్రామీణ మహిళల ఉపాధిపై ప్రత్యేక దృష్టిని వారు ఆశిస్తున్నారు.
మార్పును ఆహ్వానిస్తున్నాం..
నాలుగో తరగతి ఉద్యోగులతో పాటు అంగన్వాడీ వర్కర్లకు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చాలా కాలంగా మేం పోరాడుతున్నాం. సంఘటితంగా పోరా డాం. దాని ఫలితంగానే నేడు కేంద్ర బడ్జెట్లో జీతాల పెంపు సాధ్యమైంది. కానీ అది కూడా నామమాత్రంగానే వుంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఇది ఏ మాత్రం సరిపోదు. ప్రభుత్వం మరోసారి దీనిపై పునరాలోచన చేయాలి. కనీసంగా నాలుగో తరగతి ఉద్యోగుల జీతాలన్నా కేటాయించాలి. అలాగే వీటితో పాటే పెన్షన్ వంటి సౌకర్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- పి.రోజా, ఎపిఎడబ్ల్యుహెచ్యు స్టేట్ జనరల్ సెక్రటరీ.
మాకేమీ మంచి చేయలేదు..
ఎలక్ట్రిక్ వస్తువులు, మొబైల్స్, కార్లు రేట్లు తగ్గించడం వల్ల మాకేమి లాభం. ఉల్లిపాయలు, వెల్లుల్లి, కందిపప్పు, నూనె అన్ని రేట్లు పెరిగిపోయాయి. వీటి ధరలు తగ్గిస్తే బాగుండేది. మధ్యతరగతి మహిళలకు మంచి చేసేలా ఏదైనా కొత్తగా పథకాలు వుంటే బాగుండేది. అలాగే ఆడపిల్లల చదువులకోసం ఏదైనా చేయాల్సింది.
-లక్ష్మీకుమారి, గృహిణి, హైదరాబాదు.
ధరలు తగ్గించి వుంటే బాగుండు..
ఉద్యోగినులకు ఈ సారి బడ్జెట్లో స్థానం కల్పించక పోవడం నిరాశ కలిగించిం ది. వేతనాల పెంపు వంటి అంశాల ప్రస్తావనే లేదు. చాలా ఏళ్లుగా ఒకే వేతన స్కేలును అమలు చేస్తున్నారు. వాటిని మార్చితే బాగుండేది. నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని కేంద్రం గమనించి వుండాల్సింది.
-అరుణ, ఉద్యోగిని, మంగళగిరి.
-హైమ సింగతల
సూర్య తెలుగు దిన పత్రిక ధీర, March 1, 2011
No comments:
Post a Comment